Breaking News

కేరళలో నిఫా వైరస్‌.. బంగ్లాదేశ్‌ వేరియంట్‌

కేరళ : అత్యంత ప్రమాదకరమైన నిఫా వైరస్‌ కేరళ రాష్ట్రంలో మరోసారి విజృంభిస్తోంది. ఈ వైరస్‌ అంతకంతకూ వ్యాప్తి చెందుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నిఫా వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న కోజికోడ్‌ జిల్లా వ్యాప్తంగా హైఅలర్ట్‌ జారీ చేసింది. ఈ జిల్లాలో నిఫా వైరస్‌ కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో జిల్లాలోని 7 గ్రామాలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించారు. ముందు జాగ్రత్తగా అక్కడి బ్యాంకులు, పాఠశాలలను, ఇతర కార్యాలయాలను మూసివేశారు. కాగా, ప్రస్తుతం వెలుగు చూసిన నిఫా వైరస్‌ బంగ్లాదేశ్‌ వేరియంట్‌ అని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇది మనుషుల నుంచి మనుషులకు వ్యాపించగలదని తెలిపింది. వైరస్‌ వ్యాప్తి తక్కువగా ఉన్నప్పటికీ మరణాల రేటు అధికమని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీనాజార్జ్‌ తెలిపారు. కాగా, రాష్ట్రంలో మరొకరికి నిఫా వైరస్‌ సోకింది. 24 ఏళ్ల హెల్త్‌ వర్కర్‌ వైరస్‌ బారిన పడినట్లు అధికారులు తెలిపారు. దీంతో వైరస్‌ సోకిన వారి సంఖ్య ఐదుకు చేరింది. రాష్ట్రంలో ఇప్పటికే వైరస్‌ సోకి ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే. పరిస్థితి విషమంగా ఉన్న 9 ఏండ్ల బాలుడిని కాపాడేందుకు వైద్యులు శ్రమిస్తున్నారు. మరోవైపు, వైరస్‌ను కట్టడి చేసేందుకు అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. మెదడును అత్యంత తీవ్రంగా దెబ్బతీసే నిఫా వైరస్‌ను 1999లో తొలిసారి గుర్తించారు. మలేసియా, సింగపూర్‌లోని పందుల పెంపకందారుల్లో ఈ ఇన్‌ఫెక్షన్‌ బయటపడింది. ఇక దక్షిణ భారతదేశంలో తొలిసారి నిఫా వైరస్‌ కేసు మే 19, 2018లో కోజికోడ్‌ జిల్లాలోనే వెలుగుచూసింది. అప్పటి నుంచి రాష్ట్రంలో ఈ వైరస్‌ నాలుగుసార్లు వ్యాప్తిలోకి వచ్చింది. ఈ వైరస్‌ కారణంగా 2018, 2021లో మరణాలు నమోదయ్యాయి. మొత్తం 23 మందికి ఈ వైరస్‌ నిర్ధారణ కాగా, అందులో 21 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఎలా వ్యాపిస్తుంది..
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జంతువుల నుండి ప్రజలకు ఈ వైరస్‌ వ్యాపిస్తుంది. కలుషితమైన ఆహారం, ఈ వ్యాధి బారినపడిన వారి నుంచి ఇది నేరుగా మరో వ్యక్తికి సంక్రమిస్తుంది. ముఖ్యంగా తుంపర్లు, ముక్కు నుంచి, నోటి నుంచి వచ్చే ద్రవాల ద్వారా సోకుతుంది. ఈ వైరస్‌ లక్షణాలు తొందరగా బయటపడవు. ఈ వైరస్‌ కొందరిలో మెదడువాపుకు కారణమవుతుంది. ఒకసారి ఈ వైరస్‌ ఒంట్లోకి ప్రవేశించాక సాధారణంగా సగటున తొమ్మిది రోజుల్లో లేదా 4 నుంచి 15 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి.

లక్షణాలు, చికిత్స?
వైరస్‌ సోకిన వారికి జ్వరం, తలనొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండటం, అలసట లాంటి లక్షణాలు ఉంటాయి. వైరస్‌ సోకిన వారిలో దాదాపు 75% మంది మరణించే అవకాశముంది. దీనికి ప్రత్యేకమైన చికిత్సగానీ, ఔషధాలుగానీ లేవు. కాబట్టి మాస్క్‌లు ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *