Breaking News

ఢిల్లీలో పడిపోయిన వాయు నాణ్యత.. నేడు సీఎం కేజ్రీవాల్‌ ఉన్నతస్థాయి సమావేశం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వాసులను వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. వరుసగా నాలుగో రోజూ వాయు నాణ్యత పడిపోయింది. సోమవారం ఉదయం 9 గంటలకు వాయు నాణ్యతా సూచి (AQI) 437గా ఉందని సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ప్రకటించింది. అయితే గత మూడు రోజులతో పోల్చితే ఇది కాస్త తగ్గింది. కాగా, వాయు కాలుష్యంపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ నేడు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జరుగనున్న ఈ సమావేశానికి ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌తోపాటు రవాణా శాఖ, ఢిల్లీ మున్సిపాలిటీ, పోలీస్‌, ఇతర శాఖలకు చెందిన సీనియర్‌ అధికారులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జారీచేసిన స్టేజ్‌-4 గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ ప్లాన్‌ అమలుపై చర్చించనున్నారు. కాగా, కేజ్రీవాల్‌ ప్రభుత్వం వైఫల్యం కారణంగా ఢిల్లీలో వాతావరణ కాలుష్యం పెరిగిందనే విపక్షాల విమర్శలకు అధికార ఆప్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక కక్కర్‌ స్పందించారు. సీఏక్యూఎం ప్రకారం పంజాబ్‌లో పంట వ్యర్థాల దహనాలు 50 నుంచి 67 శాతం తగ్గాయని చెప్పారు. పంజాబ్‌లో పంట కాల్చివేతలు జరుగుతున్న ప్రాంతాలు ఢిల్లీకి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని, కానీ.. హర్యానాలోని ప్రాంతాలు మాత్రం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని వెల్లడించారు. పంజాబ్‌లోని తమ ప్రభుత్వం పంట వ్యర్థాల కాల్చివేతను విజయవంతంగా అరికడుతుండగా, హర్యానాలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం విఫలమైందని విమర్శించారు. వాయు కాలుష్యం వల్ల శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తున్నదని ఢిల్లీకి చెందిన మార్నింగ్‌ వాకర్‌ అమిత్‌ కుమార్‌ అన్నారు. ఈ కారణంగా స్కూళ్లు కూడా బంద్‌ అయ్యాయని చెప్పారు. కాష్యాన్ని తగ్గించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని తెలిపారు. కాగా, గత నాలుగైదు రోజులు కాలుష్యం అధికంగా ఉందని, కానీ అది నేడు స్పల్పంగా తగ్గిందని మరో వాకర్‌ సురేందర్‌ గుప్తా వెల్లడించారు. నగరంలో డీజిల్‌ వాహనాల ప్రవేశాన్ని నిషేదిస్తూ సీఎం కేజ్రీవాల్‌ తీసుకున్న నిర్ణయం మంతి ఫలితాన్ని ఇస్తున్నదని చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *