Breaking News

న్యాయవాది హత్యపై కేసీఆర్‌ స్పందించాలి

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

తెలుగు తేజం, హైదరాబాద్‌: హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతుల దారుణహత్య పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ హత్యేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పెద్దలకు చెందిన అవినీతి చిట్టా వామన్‌రావు దగ్గర ఉందన్నారు. న్యాయవాది దంపతుల హత్యపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వ అక్రమాలపై పోరాటం చేయడమే వామన్‌రావు దంపతుల హత్యకు కారణమని బండి సంజయ్‌ ఆరోపించారు. లాకప్‌ డెత్‌ సహా పలు అక్రమాలపై హైకోర్టులో పిటిషన్‌ వేసిన వామన్‌రావు.. వాటిపై పోరాటం చేస్తున్నారన్నారు. తెరాస పాలనలో అన్యాయానికి గురైన పేదల పక్షాన ఆయన పోరాడుతున్నారని తెలిపారు. వామన్‌రావుకు రక్షణ కల్పించాలన్న హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ప్రశ్నించే గొంతుకు రాష్ట్రంలో స్థానం లేదని చెప్పేందుకు ఈ సంఘటనే నిదర్శనమన్నారు. వామన్‌రావు దంపతుల హత్యపై సీఎం కేసీఆర్‌ స్పందించాలని డిమాండ్‌ చేశారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *