Breaking News

సాంకేతిక అద్భుతంగా పాలమూరు ప్రాజెక్టు..

భూగర్భంలోనే 61న కిలోమీటర్లు జలమార్గం

 హైదరాబాద్‌ : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఓ సాంకేతిక అద్భుతం. తెలంగాణ ఇంజినీర్ల నైపుణ్యానికి కొలమానం. శ్రీశైలం గట్టు నుంచి ప్రాజెక్టులో చివరిదైన కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ వరకు ఏర్పాటు చేసిన వాటర్‌ కండక్టర్‌ సిస్టమ్‌ పొడవు మొత్తంగా 112 కిలోమీటర్లు కాగా.. అందులో 61.08 కిలోమీటర్లు భూగర్భంలోనే ఉండడం విశేషం. ప్రధాన ఓపెన్‌ కెనాల్‌ పొడవు కేవలం 50 కిలోమీటర్లు.. అంటే కృష్ణమ్మ నీళ్లు ఎక్కువ భాగం భూగర్భంలోనే పరవళ్లు తొక్కనున్నాయి. అదీగాక భారీ జలాశయాలు, వాటిలోకి నీళ్లుపోసే సిస్టర్న్‌లు, సబ్‌ స్టేషన్లు, సిబ్బంది క్వార్టర్స్‌ మాత్రమే భూ ఉపరితలంపై కనిపిస్తాయి. మిగతా నిర్మాణాలన్నీ పెద్దపెద్ద పంప్‌హౌస్‌లు, సర్జ్‌పూల్స్‌ భూగర్భంలోనే ఉన్నాయి. భూ ఉపరితలం నుంచి సగటున వంద మీటర్ల లోతులో నిర్మితమయ్యాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రాజెక్టు యావత్తు ఓ భూగర్భ అద్భుతం. ఒక్కో సర్జ్‌పూల్‌ సగటు లోతు 75 మీటర్లు కావడం విశేషం. ప్రాజెక్టులో పంప్‌హౌస్‌లోని మోటర్ల వద్దకు చేరుకోవాలంటే ఉపరితలం నుంచి టన్నెల్‌ ద్వారా సగటున కిలో మీటర్‌ వరకు ప్రయాణించాల్సి ఉంది.

మొత్తం 11 ప్రధాన సొరంగాలు

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ప్రధాన నీటి తరలింపు నెట్‌వర్క్‌ పొడవు 112.06 కిలోమీటర్లు కాగా, అందులో ప్రధాన ఓపెన్‌ కాలువ 50.49 కిలో మీటర్లు.. కాగా మిగిలిన 61.08 కిలోమీటర్ల మార్గమంతా సొరంగమే కావడం విశేషం. అదీగాక ప్రాజెక్టుకు నీటిని తీసుకునే ఇన్‌టేక్‌ పాయింట్‌ నుంచే సొరంగ నిర్మాణాలు ప్రారంభం కావడం మరో విశేషం. నీటిని శ్రీశైలం రిజర్వాయర్‌ బ్యాక్‌వాటర్‌ నుంచి తొలుత ఓపెన్‌ అప్రోచ్‌ కెనాల్‌ ద్వారా నార్లాపూర్‌ హెడ్‌రెగ్యులేటర్‌కు తీసుకెళ్తారు. అక్కడ దాదాపు ఒక కిలోమీటర్‌ పొడవుతో నిర్మించిన 3 సొరంగ మార్గాల ద్వారా నీటిని నార్లాపూర్‌ సర్జ్‌పూల్‌కు తీసుకెళ్తారు. నార్లాపూర్‌ (అంజనగిరి) రిజర్వాయర్‌ నుంచి ఏదుల (వీరాంజనేయ) రిజర్వాయర్‌కు మొత్తంగా 21.68 కిలోమీటర్ల కెనాల్‌ ఏర్పాటు చేయగా, అందులో 5.92 కిలోమీటర్లు మాత్రమే ఓపెన్‌ కెనాల్‌. అక్కడి నుంచి 15.75 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన రెండు సొరంగమార్గాల గుండా కృష్ణమ్మ ప్రవహించి తుదకు వీరాంజనేయ రిజర్వాయర్‌కు చేరుకొంటుంది. వీరాంజనేయ రిజర్వాయర్‌ నుంచి వెంకటాద్రి (వట్టెం) రిజర్వాయర్‌కు నీటిని తరలించేందుకు మొత్తంగా 25.100 కిలోమీటర్ల కెనాల్‌ను తవ్వారు. అందులో కేవలం 3.100 కిలోమీటర్లు మాత్రమే ఓపెన్‌కాలువ కాగా, మిగతా మొత్తం సొరంగ మార్గమే. అందుకోసం 22 కిలోమీటర్ల పొడవుతో రెండు సొరంగాలను తవ్వారు. ఇక ప్రాజెక్టులో మొత్తంగా 9.750 కిలోమీటర్ల ఓపెన్‌ కెనాల్‌ ద్వారానే నీరు తరలిపోయేది కేవలం వెంకటాద్రి రిజర్వాయర్‌ నుంచి కురుమూర్తిరాయ (కరివెన) రిజర్వాయర్‌కు మాత్రమే. కురుమూర్తి రిజర్వాయర్‌ నుంచి ఉద్దండాపూర్‌ రిజర్వాయర్‌కు ప్రాజెక్టు మొత్తంలో ఓపెన్‌ కెనాల్‌ లేకుండానే పూర్తిగా 8.935 కిలోమీటర్ల సొరంగ మార్గం ద్వారానే నీటిని తరలిస్తుండడం విశేషం. అందుకోసం రెండు సొరంగాలను ఏర్పాటు చేశారు. సొరంగమార్గాలు మినహాయించిన దాదాపు 10 కిలోమీటర్ల మేర కృష్ణమ్మ ప్రెషర్‌ మెయిన్స్‌ పైపులు, అండర్‌గ్రౌండ్‌ సర్జ్‌పూల్స్‌, డ్రాఫ్ట్‌ ట్యూబుల గుండానే పరుగులు తీయనుండడం విశేషం. ప్రాజెక్టులో నీటి తరలింపు కోసం ప్రధాన సొరంగమార్గాలు కాకుండా ఇతరత్రా వాటి కోసం సొరంగమార్గాలను నిర్మించారు. పంప్‌హౌస్‌లు, సర్జ్‌పూల్స్‌ నిర్మాణం కోసం, వాటిని చేరుకునేందుకు, నిర్వహణ కోసం, అత్యవసర పరిస్థితుల్లో లోపలి సిబ్బంది బయటకు వచ్చేందుకు ఎస్కేప్‌ టన్నెల్స్‌ను కూడా అదనంగా నిర్మించారు. ఒక్కో పంప్‌హౌస్‌ వద్ద నిర్మించిన ఆ సొరంగమార్గాల మొత్తం సగటు పొడవు 5-7 కిలోమీటర్లు పైనే కావడం విశేషం.

డబ్బు ఆదాలోనూ ఆదర్శం

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మరో ఘనతను కూడా సొంతం చేసుకొంటున్నది. సాధారణంగా ప్రాజెక్టుల నిర్మాణంలో భారీస్థాయిలో కంకర, ఇసుక అవసరం. ఎర్త్‌ డ్యామ్‌ (రిజర్వాయర్‌ )లకు రివిట్‌మెంట్‌కు (రాతి కటకం) భారీగా రాతిని వాడాల్సి వస్తుంది. ఈ ప్రాజెక్టులో పంప్‌హౌస్‌లన్నీ భూగర్భంలోనే నిర్మాణమవుతుండటంతో తవ్వకం సమయంలో భారీగా రాళ్లు వెలికి వస్తున్నాయి. ప్రాజెక్టు పనులకు రాళ్లు, కంకర, ఇసుకగా వీటినే వినియోగించేలా అన్నిచోట్ల ప్రత్యేకంగా క్రషర్లను ఏర్పాటు చేశారు. ఫలితంగా ఒకో క్యూబిక్‌ మీటర్‌ నిర్మాణానికి సుమారు రూ.194 ఆదా అయినట్టు అధికారులు చెప్తున్నారు. ప్రాజెక్టులో సుమారు 1.30 కోట్ల క్యూబిక్‌ మీటర్ల పనులు జరుగుతున్నాయి. దీంతో సుమారు రూ.200 కోట్లకుపైగా ఆదా అవుతుండడం విశేషం.

రాష్ట్రంలోనే అతిపెద్ద టన్నెల్‌

పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఏదుల, వట్టెం వద్ద నిర్మిస్తున్న సొరంగ మార్గాలు రాష్ట్రంలోనే అతిపెద్దవిగా రికార్డులకు ఎక్కనున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం దేవాదుల ప్రాజెక్టు 3 ఫేజ్‌లో నిర్మిస్తున్న టన్నెల్‌ వ్యాసార్థం 5.6 డయామీటర్లు మాత్రమే. ఎస్‌ఎల్‌బీసీ టన్నె ల్‌ వ్యాసార్థం 2.10 డయామీటర్లు. కా గా వాటన్నింటి రికార్డులను కాళేశ్వరం ప్రాజెక్టు బ్రేక్‌ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో 10 డయా మీటర్‌ వ్యాసార్థంతో నిర్మించిన సొరంగమార్గాలే ఇప్పటివరకు రాష్ట్రంలో అత్యధిక వ్యాసార్థంతో నిర్మించిన సొరంగమార్గాలు. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డును కూడా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం బ్రేక్‌ చేయనుండటం విశేషం. రాష్ట్రంలోనే మొదటిసారిగా 11.5 డయా మీటరు వ్యాసార్థంతో సొరంగమార్గాలను నిర్మిస్తున్నారు. అంజనగిరి (నార్లాపూర్‌) రిజర్వాయర్‌ నుంచి ఏదుల పంప్‌హౌస్‌కు నీటిని తరలించేందుకు 2 సొరంగాలను, వీరాంజనేయ (ఏదుల) జలాశయం నుంచి వెంకటాద్రి (వట్టెం) జలాశయానికి జలాలను కాలువతోపాటుగా 19 కిలోమీటర్ల పొడవుతో నిర్మిస్తున్న 2 సొరంగాలను మొదటిసారిగా 11.5 వ్యాసార్థంతో నిర్మిస్తుండడం విశేషం.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *