Breaking News

ఈ నెల 14వ తేదీ నుంచి మోపిదేవిలో నాగుల చవితి మహోత్సవాలు

కరపత్రాల ఆవిష్కరించిన ఏసీ ఎన్.ఎస్.చక్రధరావు

మోపిదేవి(అవనిగడ్డ): మోపిదేవిలోని శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో ఈ నెల 14వ తేదీ నుంచి నాగుల చవితి మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తామని ఆలయ ఏసీ ఎస్.ఎస్.చక్రధరావు తెలిపారు. దేవస్థానంలో గురువారం నాడు ఆయన నాగుల చవితి మహోత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చవితి మహోత్సవాలు 14 నుంచి డిసెంబర్ 12వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. కార్తిక మాసం సందర్బంగా నెల రోజులు పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యక్షంగా, పరోక్షంగా అభిషేకములు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నాగుల చవితి సందర్భంగా 17వ తేదీ తెల్లవారుజాము 2.30 గంటలకు పుట్ట వద్ద పూజలు నిర్వహించి అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. 26వ తేదీ సాయంత్రం 6.45 గంటలకు జ్వాలా తోరణం అనంతరం భక్తులకు నాగపుట్ట దర్శనం ఉంటుందని వివరించారు. ఈ నెల 14 నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు రోజూ ఉదయం ఆరు గంటలకు గర్భాలయంలో కార్తిక మాస దీక్ష అభిషేకాలు జరుగుతాయని వివరించారు. రూ.1,116 చెల్లించిన భక్తుల గోత్ర నామాలతో నిత్యం పరోక్షంగా పూజలు చేస్తామని తెలిపారు. డిసెంబర్ 11వ తేదీన శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి లోక కల్యాణార్థం లక్ష బిల్వార్చన అత్యంత వైభవంగా జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు బొప్పన సత్యనారాయణ, ప్రధాన అర్చకులు బుద్దు పవన్ కుమార్ శర్మ, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *