Breaking News

చంద్రబాబుకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించండి.. రాజమహేంద్రవరం జైలుకు ఏసీబీ కోర్టు ఆదేశం

అమరావతి: జడ్‌ ప్లస్‌ భద్రతలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు జైల్లో అవసరమైన అన్ని ప్రత్యేక సౌకర్యాలను కల్పించాలని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం సూపరింటెండెంట్‌ను ఏసీబీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి హిమబిందు ఆదేశించారు. ‘చంద్రబాబుకు ప్రాణహాని ఉన్నందున జైల్లో ఆయనకు ప్రత్యేక గదిని కేటాయించడంతోపాటు తగిన భద్రతనూ కల్పించండి. ఇంటి నుంచి వచ్చిన ఆహారం, ఔషధాలనూ అనుమతించండి’ అని న్యాయమూర్తి తన ఆదేశాల్లో పేర్కొన్నారు. అంతకుముందు జైల్లో చంద్రబాబుకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించేలా ఆదేశించాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాదులు పిటిషన్‌ దాఖలు చేశారు. ‘మావోయిస్టులు, రాజకీయ ప్రత్యర్థులు.. ఇతర వర్గాల నుంచి చంద్రబాబు ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వం ఆయనకు జడ్‌ ప్లస్‌ భద్రతను కల్పించింది. అందువల్ల జైల్లో సాధారణ బ్లాక్‌లో ఇతర ఖైదీలతో కలిపి ఉంచితే ఆయన ప్రాణాలకు ప్రమాదం. అంతేకాకుండా చంద్రబాబుకు 73 ఏళ్ల వయస్సు. వివిధ రకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న కారణంగా ఆయన వైద్యులు సూచించిన ఆహారాన్ని తీసుకోవడంతోపాటు మందులు కూడా వాడాల్సి ఉంది. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న చంద్రబాబు జైలు నిబంధనల ప్రకారం ప్రత్యేక సౌకర్యాలకు అర్హులు. కాబట్టి ఆయనకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి’ అని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబుకు హౌస్‌ అరెస్ట్‌ (ఇంట్లోనే చట్టబద్ధ నిర్బంధం)ను అనుమతించాలని ఆయన తరఫు న్యాయవాదులు మరో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *