Breaking News

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు – పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్‌

తిరుమల : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల గిరులు అందంగా ముస్తాబయ్యాయి. బ్రహ్మాండ నాయకుడి ఉత్సవాలకు ముక్కోటి దేవతలతో పాటు..భక్త కోటి కూడా ఏడుకొండలకు చేరుకుంటున్నారు. తొమ్మిది రోజుల పాటు..రోజుకో రూపం..పూటకో వాహన సేవతో భక్తులను అనుగ్రహిస్తారు తిరుమల వెంకన్న. ఆదివారం నాడు అంకురార్పణ చేసిన వేద పండితులు.. ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. మలయప్ప స్వామి వారి సమక్షంలో గరుడ ధ్వజం ఎగురవేసి…బ్రహ్మోత్సవాలకు రా రండంటూ ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్‌ ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.. ఈ సందర్భంగా జగన్‌కు ఆలయ ప్రధాన అర్చకులు పరివట్టం కట్టారు. వేద పండితులు ఆశీర్వచనం అందించారు. రాత్రి తొమ్మిది గంటలకు పెద్ద శేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్ప స్వామి ఊరేగింపు జరిగింది. సీఎం జగన్‌ ఈ వాహన సేవలో పాల్గొన్నారు. తిరుమల పర్యటనలో భాగంగా రెండో రోజు ఏపీ సీఎం వైఎస్‌. జగన్మోహన్‌రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం విఐపీ బ్రేకు సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకొని మొక్కులు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ తిరుమల శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరంగనాయకుల మండపంలో సీఎం జగన్‌ను వేదపండితులు ఆశీర్వదించారు. శ్రీవారి దర్శనం తర్వాత పద్మావతి అతిథి గృహానికి బయలుదేరి వెళ్లారు సీఎం జగన్‌. ముఖ్యమంత్రి వెంట డిప్యూటీ సీఎంలు నారాయణస్వామి, కొట్టు సత్యనారాయణ, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డి ఉన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *