Breaking News

25 నుంచి కొవిడ్‌ టీకా! ప్రారంభించనున్న ప్రధాని మోదీ


జనవరి 15 నాటికి ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కు!
ఆ తర్వాత నుంచి సామాన్యప్రజలకు
కోవిన్‌ సాఫ్ట్‌వేర్‌లో పేరు ఉంటేనే వ్యాక్సిన్‌
టీకా తీసుకున్నాక అరగంట ఉండాల్సిందే
ఎలాంటి దుష్ప్రభావాలూ లేకుంటేనే ఇంటికి
వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారుల వెల్లడి
తొలి దశ 3 కోట్ల వ్యాక్సిన్ల నిల్వకు ఏర్పాట్లు
సరిపోతాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి

హైదరాబాద్: భారతీయులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్‌ త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది. యూకేలో మంగళవారం మొదలైన టీకా పండుగ.. మనదేశంలోనూ డిసెంబరు 25న (ఆ రోజు వాజ్‌పేయి జయంతి) మొదలు కాబోతోంది!! ఆ రోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ టీకా కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని.. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకూ తెలియజేసింది. తొలిదశ టీకా కార్యక్రమంలో భాగంగా.. కరోనాపై పోరులో ముందువరుసలో నిలిచిన వైద్యసిబ్బందికి జనవరి 15 నాటికల్లా వ్యాక్సిన్‌ అందించేందుకు అన్ని రాష్ట్రాలకూ టీకాలను అందుబాటులో ఉంచుతామని తెలిపింది. ఆ తర్వాత నుంచి సామాన్య ప్రజలకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేనున్నారు. కోవిన్‌ సాఫ్ట్‌వేర్‌ లైవ్‌ డెమాన్‌స్ట్రేషన్‌పై.. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. కొవిడ్‌ టీకా కార్యక్రమ ఏర్పాట్లను వేగవంతం చేయాల్సిందిగా రాష్ట్రాల అధికారులకు ఈ భేటీలో సూచించింది. టీకాలు ఎలా అందించాలనే విషయాన్ని పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించింది.

వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగ అనుమతులు కోరుతూ నాలుగు రోజుల వ్యవధిలో భారత్‌ బయోటెక్‌, ఫైజర్‌, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాకు (డీసీజీఐ) దరఖాస్తులు సమర్పించిన సంగతి తెలిసిందే. సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎ్‌ససీఓ) పరిధిలోని ‘కొవిడ్‌-19 విషయ నిపుణుల కమిటీ’ ఈ మూడు విజ్ఞప్తులను బుధవారం పరిశీలించనుంది. ఈ దరఖాస్తులను పరిగణనలోకి తీసుకున్నామని.. వీలైనంత త్వరలోనే ఆ మూడిటిపై లేదా వాటిలో ఏదో ఒకదానిపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించింది. తొలి దశ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు గుర్తించిన వైద్య సిబ్బంది వివరాలను కోవిన్‌ సాఫ్ట్‌వేర్‌లోకి అప్‌లోడ్‌ చేస్తున్నట్టు ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు. తొలి దశలో మూడు కోట్ల డోసుల టీకాను నిల్వచేసేందుకు ప్రస్తుతం ఉన్న శీతల గిడ్డంగులు సరిపోతాయని ఆయన స్పష్టం చేశారు.

కోవిన్‌ సాప్ట్‌వేర్‌లో పేరుంటేనే..
తొలివిడత టీకా కార్యక్రమంలో భాగంగా రాష్ట్రాల్లోని గుర్తించిన ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బంది వివరాలను కోవిన్‌ సాఫ్ట్‌వేర్‌లో.. ఆయా రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ కేంద్ర వెబ్‌సైట్‌లోకి అప్‌లోడ్‌ చేస్తున్నారు. అందులో పేరున్న వారికి మాత్రమే టీకా వేస్తారు. వైద్యులు, వైద్యసిబ్బంది కోవిన్‌ సాప్ట్‌వేర్‌లో స్వీయ రిజిస్ట్రేషన్‌ చేసుకునే వీలు కూడా కల్పించారు. అందుకు వారి గుర్తింపు కార్డును వినియోగించాల్సి ఉంటుంది. ఈ రిజిష్ట్రేషన్‌కు ఆధార్‌తో ఎటువంటి సంబంధం లేదని, ఆధార్‌ అవసరమే లేదని అధికారులు చెబుతున్నారు. సెల్ఫ్‌ రిజిష్ట్రేషన్‌ చేసుకున్న వారి వివరాలను వైద్య సిబ్బంది మరోమారు తనిఖీ చేస్తారు. వారు వ్యాక్సిన్‌ కేంద్రాలకు గుర్తింపు కార్డుతోనే వెళ్లాల్సి ఉంటుంది. టీకా కోసం స్పాట్‌ సెల్ఫ్‌ రిజిష్ట్రేషన్‌కు అనుమతించమని కేంద్రం ఆ వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్రాలకు తెలిపింది.

ఒక్కో కేంద్రంలో 100 మందికి టీకా
ఒక్కో వ్యాక్సిన్‌ కేంద్రంలో 100 మందికి కరోనా టీకా ఇవ్వనున్నారు. కేంద్రంలో రెండు బృందాలు పనిజేస్తాయి. ఒక బృందంటీకా కోసం వచ్చిన వివరాలను చెక్‌ చేస్తుంది. పోలింగ్‌ కేంద్రంలో ఓటరో కాదో పరిశీలించినట్లుగానే.. ఈ టీకా కేంద్రంలో వచ్చిన వారి వివరాలను తమ వద్ద ఉన్న వివరాలతో పోల్చి చూస్తారు. రిజిష్ట్రేషన్‌ చేసుకున్న వారి వివరాలను, వారి ఐడీ కార్డులను పరిశీలిస్తారు. మరో బృందంలో.. ఐదుగురు వైద్య సిబ్బంది ఉంటారు. ఒక వ్యాక్సినేటర్‌ ఆఫీసర్‌తో పాటు డాక్టర్‌, నర్స్‌, ఎఎన్‌ఎమ్‌, సహాయకుడు ఉంటారు. టీకా వేసే బృందం ఇది. టీకా నిల్వ కోసం వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్దే చిన్నపాటి మూవింగ్‌ ఫ్రీజర్స్‌ను ఉంచుతారు.

టీకా తీసుకున్నాక..
కరోనా టీకా తీసుకున్నవారు తర్వాత అరగంట పాటు ఆ కేంద్రం వద్దనే ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కరోనా టీకాను తొలిసారి ఇస్తున్న నేపథ్యంలో దాని దుష్ప్రభావాలు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు. ఏ సమస్యలూ లేవని నిర్ధారించుకున్నాకే అక్కడి నుంచి వెళ్లాల్సి ఉంటుంది. కాగా వ్యాక్సిన్‌ తీసుకున్న వారి సెల్‌ఫోన్‌కు ఒక మేసేజ్‌ వస్తుంది. అందులో ఉండే లింకుపై క్లిక్‌ చేస్తే తొలి డోసు వ్యాక్సిన్‌ తీసుకున్నట్లుగా వివరాలుంటాయి. మూడు వారాల తర్వాత రెండో డోసు తీసుకున్న తర్వాత కూడా మళ్లీ మేసేజ్‌ వస్తుంది. అందులో పూర్తిస్థాయిలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు ఉంటుంది. రెండో డోసు అనంతరం వ్యాక్సిన్‌ తీసుకున్నట్లుగా వైద్య ఆరోగ్యశాఖ ధ్రువీకరణ పత్రాన్నిస్తుంది.

ఒకసారి ఇచ్చిన డోసే..
కరోనా టీకా తీసుకున్న వారు తొలుత ఏ కంపెనీకి చెందిన వ్యాక్సిన్‌ తీసుకున్నారో మూడు వారాల తర్వాత అదే కంపెనీ టీకాను తీసుకోవాల్సి ఉంటుంది. మొదటఒక కంపెనీ టీకా, రెండోసారి మరో కంపెనీ టీకా తీసుకుంటామంటే కుదరదు. ఇండియాలో ఇచ్చే వ్యాక్సిన్‌ మైనస్‌ 2, మైనస్‌ 8 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య నిల్వ ఉండేదే వస్తుందని అధికారులు చెబుతున్నారు.

ప్రత్యేక ఏర్పాట్లు
ముందుజాగ్రత్త చర్యగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ కేంద్రాల వద్ద ఒక అంబులెన్స్‌తో పాటు ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్లు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు. మంచినీరు, ఇంటర్నెట్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. టీకాతో ఏమైనా దుష్ప్రభావాలు కనిపిస్తే వెంటనే అక్కడే ప్రాథమిక చికిత్సను అందించేందుకు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ ఎవరికైనా ఆరోగ్య పరిస్థితి విషమిస్తే వెంటనే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్తారు. ఇటువంటి కేసుల కోసం ప్రతి జిల్లా ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఓ పది పడకలను కేటాయిస్తున్నారు. అలాగే పీహెచ్‌సీల్లోనూ ఆక్సిజన్‌ సిలిండర్లను అందుబాటులో ఉంచనున్నారు.

శంషాబాద్‌ ఎయిర్‌ కార్గో సిద్ధం
కరోనా వ్యాక్సిన్ల ఎగుమతి, దిగుమతులు, నిల్వకు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోని హైదరాబాద్‌ ఎయిర్‌ కార్గో సిద్ధంగా ఉందని జీఎంఆర్‌ అధికారులు మంగళవారం ఒకప్రకటనలో తెలిపారు. 80 దేశాల రాయబారులు, హైకమిషనర్లు తెలంగాణలో ఉన్న భారత బయోటెక్‌ లిమిటెడ్‌, ఇ-బయోలజికల్‌ లిమిటెడ్‌లో కరోనా వ్యాక్సిన్లను తయారు చేసే పరిశోధన కేంద్రాలను బుధవారం సందర్శించనున్నారని.. తిరిగి వెళ్లే ముందు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఉన్న హైదరాబాద్‌ ఎయిర్‌ కార్గో కేంద్రాన్ని పరిశీలించే అవకాశం ఉందని ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. గ్లోబల్‌ రవాణాకు వీలుగా ఎన్నో సదుపాయాలు జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు కార్గోలో ఉన్నాయని వెల్లడించాయి. అటు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కూడా వ్యాక్సిన్‌ ఎగుమతి, దిగుమతులకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *