Breaking News

కొలిక్కి వచ్చిన దుర్గగుడి వెండి సింహాల కేసు

తెలుగు తేజం, విజయవాడ: బెజవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ రథానికి ఉండే 3 వెండి సింహాల ప్రతిమల మాయం కేసు ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పాత నేరస్థుడే ఈ చోరీకి పాల్పడినట్టు సమాచారం. గతేడాది సెప్టెంబరులో దుర్గమ్మ వెండిరథంపై సింహాల ప్రతిమలు మాయమైనట్టు గుర్తించారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపాయి. ఆలయంలో పనిచేసే సిబ్బందితో పాటు దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో పనిచేసిన ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు, ఈ తరహా చోరీలకు పాల్పడే పాత నేరస్థులు 40 మందిని విచారించారు.

అయినా, ఒక్క ఆధారం కూడా లభించలేదు. ఆలయంలో సీసీ కెమెరాల ఫుటేజీ లేకపోవడంతో ఇంటి దొంగలను కాపాడే క్రమంలోనే ఆలయ సిబ్బంది సహకరించడం లేదనే ఆరోపణలు వినిపించాయి. దీంతో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. అయితే, ప్రస్తుతం ఈకేసులో పోలీసులు పురోగతి సాధించినట్టు సమాచారం. ఇటీవల పశ్చిమగోదావరి జిల్లాలో పోలీసులు దొంగతనాల కేసులో బాలకృష్ణ అనే నిందితుడ్ని అరెస్టు చేశారు. విచారణ సమయంలో దుర్గగుడిలో వెండి సింహాలను తానే అపహరించినట్టు అంగీకరించాడు. దీంతో ఈ విషయాన్ని వెంటనే విజయవాడ పోలీసులకు తెలిపారు. సమాచారం అందుకున్న ప్రత్యేక బృందం అక్కడకు వెళ్లి నిందితుడ్ని అదుపులోకి తీసుకుని కేసుకు సంబంధించి కీలక విషయాలను రాబడుతున్నట్టు తెలిసింది.

వెండి సింహాలను దొంగిలించిన బాలకృష్ణ తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన ఓ బంగారు వ్యాపారికి వీటిని విక్రయించాడు. ప్రస్తుతం ఆ వ్యాపారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి దగ్గర నుంచి ప్రతిమలను తీసుకున్న వ్యాపారి వెంటనే వాటిని కరిగించాడని, వాటి బరువు దాదాపు 16 కిలోలు ఉందని చెబుతున్నారు . అయితే ఈ విషయాన్ని పోలీసుల ధ్రువీకరించడం లేదు. ప్రస్తుతం దుర్గగుడి అధికారులు, సిబ్బంది దీని గురించే మాట్లాడుకుంటున్నారు. పోలీసులు అనుమానితుడిని రెండు, మూడు రోజుల్లో అరెస్టు చూపించే అవకాశం ఉందని సమాచారం.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *