Breaking News

తెలంగాణ పత్తికి బ్రాండ్‌ ఇమేజ్‌ తేవాలి: కేసీఆర్‌

హైదరాబాద్‌: అత్యంత నాణ్యతతో కూడిన పత్తికి అంతర్జాతీయంగా డిమాండ్‌ వచ్చేలా బ్రాండ్‌ ఇమేజ్‌ తీసుకురావాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వ్యవసాయ విస్తరణపై మంత్రి నిరంజన్‌ రెడ్డి, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. పత్తి సాగు, మార్కెటింగ్‌పై ఆయన సూచనలు చేశారు. రాష్ట్రంలో పండే పత్తి దేశంలోనే అత్యంత నాణ్యమైనదిగా గుర్తింపు పొందిందని.. ప్రపంచంలో అత్యంత నాణ్యమైన పత్తిని ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో తెలంగాణ ఒకటని కేసీఆర్‌ చెప్పారు. తెలంగాణ పత్తికున్న విశిష్ట లక్షణాలను గుర్తించి, వాటిని ప్రచారం చేసేందుకు అవసరమైన వ్యూహం రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. దీనికోసం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిపుణులతో ఓ సదస్సు నిర్వహించాలన్నారు.

అంతర్జాతీయంగా మరింత డిమాండ్ వచ్చేలా పత్తిశుద్ధి, ప్యాకింగ్ అంశాల్లో రైతులకు తగిన సూచనలు ఇవ్వాలని కేసీఆర్ సూచించారు. 60 లక్షల ఎకరాలతో దేశంలోనే ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేస్తున్న రెండో రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. సాగునీటి ద్వారా సాగు చేసే భూముల్లో పత్తిపంట మరింత బాగా వస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులతో సాగునీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చినందున కాల్వల కింద పత్తిని సాగు చేస్తే మరింత లాభసాటిగా ఉంటుందని చెప్పారు. పత్తికి మంచి మార్కెట్ వచ్చేలా ప్రభుత్వం కూడా అవసరమైన చర్యలు తీసుకుందని.. జిన్నింగ్ మిల్లుల సంఖ్యను 60 నుంచి 300కు పెంచేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. పత్తి ఎక్కువగా పండే ప్రాంతాల్లో జిన్నింగ్ మిల్లులను నెలకొల్పేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. లాభసాటి పంటలనే పండించాలన్న ప్రభుత్వ సూచనలను రైతులు పాటించి నియంత్రిత పద్ధతిలో సాగు చేస్తున్నారని, ఇది మంచి సంప్రదాయమని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. మార్కెట్లో పత్తి, నూనె గింజలు, పప్పులకు మంచి డిమాండ్ ఉందన్నారు. కూరగాయలకు కూడా మంచి ధర వస్తున్నందున వాటినీ ఎక్కువగా పండించాలని చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *