పెడన తెలుగు తేజం ప్రతినిధి : పెడనలోని ప్రేమాంజలి సోషల్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదపడే మూడు నెలల నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సు, కంప్యూటర్ శిక్షణ, డ్రైవింగ్తో పాటు విద్యార్థుల కోసం సాయంత్రపు కోచింగ్ తరగతులు పట్టణంలోని ఐదు కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. మహిళలు స్వయం ఉపాధి సాధించి కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకోవడం, ఇతరులపై ఆధారపడకుండా స్వయంసమృద్ధిగా జీవించేందుకు ప్రోత్సహించడమే ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. విజయవాడ డయాసిస్ బిషప్ జోసెఫ్ తెలగతోటి పేద కుటుంబాల ఆర్థిక స్థితిని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి మద్దతు అందించారు. విజయవాడ డయాసిసన్ సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ రెవ్. ఫా. సునీల్ ప్రారంభించి మహిళా సాధికారత ప్రాజెక్ట్ కింద 15 అర్హులైన కుటుంబాలకు 15 కుట్టు యంత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా ప్రేమాంజలి సమన్వయకర్తలు సిస్టర్ ఫెల్సీ, సిస్టర్ ప్రేమ మాట్లాడుతూ మహిళలు కొత్త అవకాశాలను సృష్టించుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని, కుటుంబ సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.