పేదలకు పండ్లు, మిఠాయిల పంపిణీ – నేతన్నలకు మరింత ప్రోత్సాహం అందించాలని రాష్ట్ర పద్మశాలి సంఘం విజ్ఞప్తి
తెలుగు తేజం ప్రతినిధి, విజయవాడ:
జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ మల్లికార్జునపేటలోని పద్మశాలి కళ్యాణ మండపంలో రాష్ట్ర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికుల సేవలను స్మరించుకుంటూ పేదలకు పండ్లు, మిఠాయిలు పంపిణీ చేసి సామాజిక సేవా కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పద్మశాలి సంఘ సభ్యుడు కోసూరి సుబ్రహ్మణ్యం (మణి) మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు చేనేత వృత్తి ప్రతీకగా నిలిచిందన్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది నేతన్నలు తమ కష్టంతో భారతీయ వస్త్ర వైభవాన్ని ప్రపంచానికి చాటిచెబుతున్నారని పేర్కొన్నారు. చేనేత రంగం ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం నేతన్నలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, సంక్షేమ పథకాలు, మార్కెటింగ్ సదుపాయాలు, ముడిసరుకు రాయితీలు అందించి వారి జీవనోపాధిని బలోపేతం చేయాలని కోరారు.
అనంతరం పేదలకు పండ్లు, మిఠాయిలు పంపిణీ చేసి జాతీయ చేనేత దినోత్సవం సందేశాన్ని ప్రజలకు చేరవేశారు. చేనేత వస్త్రాల వినియోగాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకుని నేతన్నలకు అండగా నిలవాలని సంఘ నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి సంఘ సభ్యులు కోసూరి సుబ్రహ్మణ్యం (మణి), వానపల్లి త్రిమూర్తులు, జాగు రమణ, జాగు సూరిబాబు, కొల్లి మాణిక్యాలరావు, దుర్గారావు, వానపల్లి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పద్మశాలి సంఘ నాయకులు, కుల బంధువులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.